ఆర్టీసీ సమ్మెపై నిరంకుశ, ఏకపక్ష వైఖరి అనుసరించిన సీఎం కేసీఆర్ కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భయంతోనే దిగిరాక తప్పలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎన్ని ఆంక్షలు విధించినా ధైర్యంగా ఉద్యమించిన కార్మికులు విజయం సాధించారని తెలిపారు.
హక్కుల కోసం గొంతెత్తే ప్రజలు, కార్మికుల పట్ల కేసీఆర్ అహంకార పూరిత ధోరణి ఇకనైనా వీడాలని హితవు పలికారు. సమ్మె తీవ్రం కావడంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్ దిగిరాక తప్పలేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి ఎల్లయ్య, మల్లయ్య అంటూ మాట్లాడిన కేసీఆర్ వారు ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెపై బీజేపీ ఎంపీలు కేంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లిన నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధమైందనే విషయం కేసీఆర్ గ్రహించారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం రంగంలోకి దిగితే ప్రైవేటు సంస్థలతో కేసీఆర్ కుటుంబం కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు బయటపడతాయని భయపడి సమ్మెపై కేసీఆర్ దిగివచ్చారని అన్నారు.
కేంద్రంపై కేసు వేస్తానన్న కేసీఆర్ దమ్ముంటే కేసు వేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు. సమ్మె జరుగుతున్నంత కాలం కేసీఆర్ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా 30 మంది కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక డ్రైవర్ల అనుభవ రాహిత్యం వల్ల సుమారు వంద మంది సామాన్య ప్రజలు ప్రమాదాల బారిన పడి చనిపోయారని గుర్తుచేశారు.
కార్మికులు, ప్రజల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సమ్మె జరిగినంత కాలం చోద్యం చూసిన కేసీఆర్ చివరికి సామాన్య ప్రజానీకంపై భారం మోపేలా బస్సు ఛార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు. సమ్మె సమయంలో డిపోలలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు.