విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అలాగే కేసీఆర్ అవినీతిని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వివరించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని స్వయంభూ కాళికమాత ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఏడేళ్లుగా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సైతం కట్టలేదని సర్కార్ ను విమర్శించారు. జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం, ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని ఆలోచించకపోవడం సిగ్గుచేటన్నారు. నల్గొండ జిల్లాలో ఓ దళిత యువతి హత్య జరిగితే జగదీష్ రెడ్డి వెళ్లి పరామర్శించకపోవడం దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు.`
రాష్ట్ర విభజన చట్టంలోహైదరాబాద్ విజయవాడ రహదారిని ఎక్స్ప్రెస్ వేగా మారుస్తామని పొందుపర్చితే ఇప్పటికీ అటువైపు అడుగులు వేయలేదని తెలిపారు.
పేద పిల్లల చదువు కోసం, గురుకులాల అభివృద్ది కోసం ఎంతగానో కృషిచేసిన గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పొగిడారు. అలాంటి వ్యక్తులపై దళిత బంధుకు వ్యతిరేకంగా మాట్లాడినారని కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతించాలని కానీ ఇలా కేసులు పెట్టడం తగదని వారించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. తప్పకుండా ప్రజల అభివృద్ది కొరకు సర్కార్పై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.
పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్