లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంతో మానసిక వత్తిడితో కూడా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి మేమున్నాం అంటూ ఎంతో మంది సహాయం చేస్తున్నారు. కొందరు తిండి ఇస్తున్నారు మరి కొందరు మజ్జిగ ఇస్తున్నారు.
పోలీసులను సామాన్య ప్రజలు జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ సమయంలో టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు పి.రాములు మాత్రం తన కొడుకును ఎందుకు ఆపారు అంటూ నిలదీస్తున్నారు. ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు అయిన భరత్ కుమార్ ఈ నెల 15న మరో నలుగురితో కలిసి కారులో నగరానికి వస్తున్నారు.
పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు ఎంపీ స్టిక్కర్తో ఉన్న కారులో ఎంపీ కనిపించకపోవడంతో కారును ఆపారు. దీంతో భరత్కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను ఎంపీ కుమారుడినంటూ పోలీసులను హెచ్చరించారు.
దీంతో పోలీసులు కారును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోసారి ఇలా చేయొద్దంటూ భరత్కుమార్కు చెప్పి వదిలేశారు. విషయం తెలిసిన ఎంపీ రాములు ఆ తర్వాతి రోజు హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
తన కుమారుడు వెళ్తున్న కారును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తన కారును ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.