ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, పాత రుణాలపై మారటోరియం కొనసాగించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మే నెలలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ లో నైరుతి రుతుపవనాలు సకాలంలో జిల్లాలోకి ప్రవేశిస్తే రైతులు పంట సాగుకు అవసరమైన వ్యవసాయ రుణం, రాయితీ విత్తనాలు ఎరువులు, కిసాన్ సమ్మాన్ నిధి, రైతు భరోసా సకాలంలో అందితేనే రైతులు వ్యవసాయానికి ఉపక్రమిస్తారని అన్నారు.
ఇప్పటికే జిల్లా రైతాంగం కరువులో అధికమాసం అన్నట్లు కరోనా దెబ్బకు కుదేలు అయిపోయిందన్నారు. బ్యాంకులు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పాత రుణాలు పునరుద్ధరించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. కరోనా ప్రభావంవల్ల బయట అప్పులు పుట్టక, పెట్టుబడికి అవసరమైన రుణం అందకపోతే రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం కష్ట సాధ్యం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సహాయాన్ని ఖరీఫ్ ప్రారంభానికి ముందే అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న పంటల భీమ, పెట్టుబడి రాయితీ పరిహారంతో పాటు ఇటీవల కరోనా వల్ల కొనుగోలు లేక నష్టపోయిన రైతాంగాన్ని, గాలి వాన లకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.