ములుగు జిల్లా సమగ్రాభివృద్ది దిశగా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అత్యుత్తమ సేవలనందించారని ములుగు శాసన సభ్యులు ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన ఐఎఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో తెలంగాణ పోలుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గా బదిలిపై వెళ్తున కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య కు మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఎం ఎల్ ఏ పాల్గొన్నారు.
ములుగు శాసన సభ్యులు ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ములుగు జిల్లా కలెక్టర్ గా యస్. క్రిష్ణ ఆదిత్య గత మూడున్నర సంవత్సరాలుగా జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేసారని, 2020, 2022 మేడారం జాతరలు దిగ్విజయంగా చేశారని, ప్రజా సమస్యలను పకడ్బందీ పరిష్కారంలో కలెక్టర్ కృషి , నాయకత్వం ఉన్నాయని ఎం ఎల్ ఏ ప్రశంసించారు.
ప్రజలలో సైతం మంచి పేరు సాధించుకోవడంలో కలెక్టర్ సఫలీకృతులయ్యారని, ములుగు జిల్లాను అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో విశిష్ట కృషి చేసారని ఆమె అన్నారు. ములుగు జిల్లాలో జిల్లా కలెక్టర్ స్నేహపూర్వక వాతావరణం లో మంచి బృందంగా ఏర్పడి ప్రజల సమస్యలు పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేశారని, బదిలీ కావడం జిల్లాకు లోటు ఏర్పడుతుందని, జిల్లా ప్రజలలో మంచి ముద్ర వేసే విధంగా విశేష కృషి చేశారని ఆమె తెలిపారు.
తెలంగాణ పోలుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సైతం కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య తన ప్రతిభను చూపించి అక్కడి సవాళ్లను అధిగమిస్తు మంచి పాలన అందించాలని, యస్. క్రిష్ణ ఆదిత్య ప్రారంభించిన మంచి కార్యక్రమాలు కొనసాగిస్తు, అవసరమైన మేరకు నూతన కార్యక్రమాలను సైతం ప్రారంభిస్తు ములుగు ని మరింత అభివృద్ది చేసే బాధ్యతను నూతన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమర్థవంతంగా నిర్వహించాలని ఆశిస్తున్నానని, జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నూతన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో మూడున్నర సంవత్సరాలుగా యస్. క్రిష్ణ ఆదిత్య విశేషమైన సేవలు అందించారని అన్నారు. భవిష్యత్తులో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ములుగు జిల్లా మరింత అభివృద్ది సాధించే దిశగా తాను కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటిడిఏ పి ఓ అంకిత్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ములుగు జిల్లా మంచి పేరు సాధించడంలో జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య నాయకత్వం కృషి ఎంతగానో ఉందని ఆయన తెలిపారు.
అందరి సహకారంతో జిల్లా అభివృద్ది
ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ములుగు జిల్లా మంచి పేరు సాధించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కృషి ఎంతగానో ఉందని కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య తెలిపారు. ములుగు జిల్లాలో విధులు నిర్వహించడం తనకు చాలా సంతృప్తిని అందించిందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో అధికారులు చాలా కృషి చేసారని అన్నారు.
మేడారం జాతర లు, పల్లె ప్రగతి, రైతు బంధు, రైతు బీమా అమలు, రైతు వేదికల నిర్మాణం, వరదలసమయంలో లోతట్టు ప్రాంతాల వారిని తరలింపు వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందని, ములుగు జిల్లాలో అద్భుతమైన అధికార బృందం ఉందని అన్నారు.
ములుగు జిల్లా తనకు ఎప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుందని, మూడున్నర సమయంలో తనకు పూర్తి స్థాయిలో సహకరించిన గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది సహకారం అందించారని, ఇంఛార్జి మంత్రి దగ్గరి నుంచి సర్పంచ్, వార్డు మెంబర్ల వరకు సహకారం అందించారని కలెక్టర్ తెలిపారు. ములుగు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం లో వచ్చే చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లను చూపిస్తు సరిదిద్దుకునేందుకు సహకరించిన పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం మన వద్ద లేని పక్షంలో ఎక్కడ పరిష్కారం లభిస్తుందో సలహా ఇవ్వాలని, సమాజంలో ప్రభావం చూపని వ్యక్తులకు సహయం చేస్తే పేద ప్రజలు మనల్ని గుండెలో పెట్టుకుంటారని అన్నారు. జిల్లాలో పల్లె ప్రగతి చేపట్టిన ప్రతి కార్యక్రమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు మన జిల్లాకు వచ్చాయని, దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, డి ఏఫ్ ఓ, ఏ ఎస్ పి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.