కష్ట కాలంలో మతాన్ని మరచి మానవత్వానికే ఓటు వేస్తామని ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ వాసులు మరొక్క మారు నిరూపించారు. అక్కడ రవిశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆయన గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు.
తాజాగా కోవిడ్ 19 సోకిందో ఏమో తెలియదు కానీ ఆయన మరణించాడు. ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆయనతోనే ఉన్నారు కానీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఆయన మరణ వార్త విన్న తర్వాత కూడా మిగిలిన బంధువులు, స్నేహితులు అక్కడకు రాలేకపోయారు.
ఉన్న ఒక్క కొడుకు అంత్యక్రియలు ఎలా చేయాలి? దహనం చేసేందుకు కనీసం నలుగురు మనుషులు మోయాలి కదా? ఈ విషయాన్ని ఆలోచిస్తుండగానే ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం సోదరులు ముందుకు వచ్చారు. వారు భుజం భుజం కలిపారు.
రవిశంకర్ భౌతిక కాయాన్ని పాడెపై మోసుకుంటూ అంత్యక్రియలు జరిగే స్థలం వరకూ తీసుకువెళ్లారు. రవి శంకర్ భౌతిక కాయాన్ని మోసే సమయంలో వారు రామ్ నామ్ సత్య హై అంటూ రవిశంకర్ కు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. కాష్టం పేర్చి, కుమారుడితో తలకొరివి పెట్టే వరకూ కూడా ముస్లిం సోదరులు అక్కడే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వారు ఇళ్లకు వెళ్లారు. దటీజ్ ఇండియా.