నాథూరాం గాడ్సే… పేరు వినగానే అతడిని దేశ ద్రోహిగా ఇంతకాలం ప్రచారం జరిగింది. భారత జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే గురించి జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం.
కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)’ అని నాగబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.’గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు.
కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
మనిషిని చంపిన వ్యక్తిని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాథూరాం గాడ్సే తన మనోభావాలను వెల్లడించిన వీడియోను కూడా నాగబాబు ట్వీట్ చేశారు. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం తీసుకునే సమయంలో పాకిస్తాన్ ను విడగొట్టడం, పాకిస్తాన్ లో హిందువుల గురించి ఆలోచన చేయకపోవడం గాంధీ చేసిన తప్పిదాలుగా అందులో పేర్కొన్నారు.
మీడియా అంతా గాంధీ చేతుల్లో ఉండేదని, అందుకు భిన్నంగా ఎవరైనా రాస్తే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించేవారని కూడా ఆ వీడియోలో నాథూరాం గాడ్సే అభిప్రాయంగా చెప్పారు. పాకిస్తాన్ లోని హిందువులను వేటాడి చంపారని, మహిళను వివస్త్రలను చేసి అమ్మారని నాథూరాం గాడ్సే ఆవేదన చెందాడు.
పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలలోని హిందువులు భారత్ లోకి వస్తుంటే రానివ్వలేదని కూడా ఆయన అన్నారు. ఈ కారణాలతోనే గాంధీపై తనకు కసి పెరిగి హత్య చేసినట్లు నాతూరాంగాడ్సే అన్నారు.
ఇవన్నీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో నాగబాబు బిజెపి ఇంతకాలం చేస్తున్న వాదనను ఎండార్స్ చేసినట్లుగా అనిపిస్తున్నది. ఇది రాజకీయ పరంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తున్నది.