మతిస్థిమితం లేని పదేళ్ల బాలిక రెండు రోజుల క్రితం తప్పిపోయింది. తప్పిపోయిన విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయడంతో పాటు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. నేడు ఆ బాలిక అడవిలో విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొడుగుమర్రి తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూలఇప్ప తండాలో మతిస్థిమితం లేని పది సంవత్సరాల వయస్సు గల బాలిక ఈ నెల 17 న అదివారం అదృశ్యమై తాండ శివారులోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది.
పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తండాకు చెందిన చందర్, మంగ్లీ లు దంపతులు. వీరికి 10 సంవత్సరాల మతిస్థిమితం లేని సంజనతో పాటు మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు.
భార్యను తెచ్చుకునే క్రమంలో కూతురి రక్షణ మరచి..
చందర్, మంగ్లీలు తండాలో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. ప్రతిరోజు సంజనకు తల్లిదండ్రులు అన్నం తినిపించి ఇంటి బయట తాడుతో కట్టేసి వెళ్ళిపోయేవారు. అయితే ఆదివారం భార్య, భర్తల మధ్య గొడవ జరగడంతో భార్య అలిగి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ క్రమంలో భార్యను వెతికేందుకు చందర్ బయటకు వెళ్ళేముందు సంజనకు అన్నం తినిపించి తాడుతో కట్టి వేయకుండా వెళ్ళిపోయాడు. మతిస్థిమితం లేని సంజన నడుచుకుంటూ అటవీ ప్రాంతంలో కి వెళ్ళిపోయింది.
అదివారం సాయంత్రం చందర్, మంగ్లిలు ఇంటికి వచ్చి చూసేసరికి సంజన కనిపించలేదు. భార్యాభర్తలిద్దరూ చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సమయంలో తండా శివారులోని అటవీ ప్రాంతంలో సంజన శవంగా కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.