ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబం ధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. విద్యార్థులు విధిగా పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని కోరింది. సైన్స్ విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్స్ ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. మే 6 నుంచి 24 వరకు థియరీ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ రెండో వారం నుంచి సంబంధిత కాలేజీల్లో విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వ హించాలని నిర్ణయించారు. వాటి తేదీలను ఆయా కాలేజీలు నిర్ణయించనున్నాయి
. గతేడాది ఫైనల్ పరీక్షల కోసం మూడు సెట్ల ప్రశ్నపత్రాలను రూపొందించగా, ఇందులో ఒకటి మాత్రమే వాడారు. మిగిలిన రెండు పేపర్లను ఇప్పుడు ప్రీఫైనల్ కు వాడాలని అధికారులు సూచించారు. గత ఏడాది జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులైన నేపథ్యంలో మేలో జరిగే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో స్టడీ మెటీరియల్ ను అందు బాటులో ఉంచాలని బోర్డు భావిస్తోంది. దీంతో పాటు పరీక్షల భయాన్ని పోగొట్టడం, సమయ పాలన, పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రీఫైనల్స్ దోహదపడతాయని, ఈ కారణంగా ప్రతీ ఒక్క విద్యార్థిని ఈ పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని కాలేజీలకు సూచించింది.