ప్రణాళికలతోనే పురపాలికల అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆదివారం ఆకస్మికంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ లతో కలిసి నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ పట్టణంలోని పలు కాలనీలలో తిరుగుతూ చైర్మన్లు, కమిషనర్లు, అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
పట్టణ అభివృద్ధితో వచ్చే మార్పులు కొల్లాపూర్ రూపురేఖలు మారుతాయని అన్నారు. కొల్లాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఈ మేరకు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పురపాలికల ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
అవసరమైన చోట ఎల్ ఇ డిలు పెట్టండి
ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించాలని, విద్యుత్తు పొదుపు పాటించేందుకు అవసరమైన చోట ఎల్ఈడీ దీపాలు బిగించాలని, కెపాసిటర్లను వినియోగించడం ద్వారా బిల్లులు తగ్గే విషయాన్ని పరిశీలించాలని అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, పచ్చదనం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కొల్లాపూర్ పట్టణంలో డంప్యార్డులపై దృష్టి సారించాలని, తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించి, చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. డంప్యార్డులను ఆధునిక పద్దతిలో నిర్వహించాలని, మున్సిపాలిటిలో బయోలాజికల్ వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు చేపట్టాలన్నారు.
కొల్లాపూర్ పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక షీ టాయిలెట్ నిర్మించాలని, అందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు.
బస్టాండ్ పరిసర ప్రాంతాల పరిశీలన
పట్టణ ప్రజల కోరిక మేరకు నీరు సరఫరా చేస్తున్నారా.? ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా.? లేదా అంచనాలు తయారు చేయాలని, ప్రజలకు మంచినీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికబద్దంగా నిర్వహించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకే చైర్మన్, కమిషనర్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని పరిశుద్ధ పనులపై పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
పట్టణంలోని పలువురు వీధి విక్రయదారులు తో కలెక్టర్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన వీధి వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేల విలువ గల రుణ సదుపాయాన్ని కల్పిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అందుకు కావాల్సిన దరఖాస్తులను మున్సిపాలిటీల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ వారికి సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న నర్సరీని కలెక్టర్ పరిశీలించారు.
పట్టణంలోని రోడ్లవెంబడి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టణంలో హరిత వనం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని వెంటనే ఎంపిక చేయాలని కమిషనర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్నింగ్ వాక్ లో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, వైస్ చైర్మన్ మెహమూద్ బేగం, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.