శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి వరద ఉదృతంగా వస్తున్నందున నది పరివాహక ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ కోరారు. ఎవరూ నది పరివాహక ప్రాంతానికి వెళ్లకూడదని, ప్రవాహం చాలా ఉదృతంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
పశువులను మేపడానికి నదిపరివాహక ప్రాంతానికి తీసుకువెళ్లవద్దని, ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా గ్రామాల్లో టామ్ టామ్ చేసి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఇప్పటికే పంచాయతీ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి తగు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం జూరాల, తుంగభద్ర నుండి దాదాపు 4.72 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం నిండి బ్యాక్ వాటర్ పెరుగుతున్నందున నదిపరివాహక ప్రజలు అత్యంత అప్రమతంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.