పులి చర్మం అమ్మడం లాభసాటి వ్యాపారం అనుకున్నారు. ఇంకేం… దాని కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ములుగు జిల్లా పోలీసులు వలపన్ని పులి చర్మం అమ్మే వారిని పట్టుకున్నారు. వాజేడు గ్రామ నివాసి తిరుమలేష్, అతని బావ చత్తీస్ గఢ్ రాష్ట్రం, తాళ్ల గూడ మండలం, చండూరు గ్రామ నివాసి అయిన సాగర్ లు పులి చర్మం వ్యాపారం చేస్తూ దొరికి పోయారు.
ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్ద పులి చర్మం అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని ములుగు జిల్లా ఎస్ పి సంగ్రామ్ సింగ్ పాటిల్ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఒక పులి చర్మం, ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ఒకటి స్వాధీనపరచుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
నెల రోజుల నుంచి ప్రయత్నించగా వారికి ఒక వ్యక్తి పులి చర్మాన్ని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తానని చెప్పాడు. దాంతో వారు పులి చర్మం తీసుకుని దాన్ని అమ్మేందుకు బయలుదేరి పోలీసులకు చిక్కారు. తిరుమలేష్ ఈ పులి చర్మాదన్ని సత్యం అనే వ్యక్తి ఇంట్లో దాచి పెట్టాడు. అనంతరం ఈ రోజు దానిని అమ్మడానికి తిరుమలేష్, సత్యం ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్దకు రాగా ఏటూరు నాగారం సీఐ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఏటూరునాగారం సిఐ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారి ఇన్ఛార్జ్ ఎఫ్ డి ఓ గోపాల్ రావు, ఇతర అధికారులు పులి చర్మం పరీక్షించి నిజమైన పులి చర్మం గా నిర్ధారించారు.
అనంతరం అటవీ సంరక్షణ చట్టం-1972 ప్రకారం అటవీ అధికారుల సమక్షంలో స్వాధీన పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం, శివ ఆశిష్ సింహం, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, సీఐ ఏటూరునాగారం కిరణ్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ సిబ్బంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.