మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగానే హిందువులను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ లో బిజెపి నాయకులు భారీ ఎత్తున ఆందోళన ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, నూతలపాటి బాల, వంగవీటి నరేంద్ర అరెస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి నానిని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రధాని మోడి, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి గురించి మాట్లాడే అర్హత నానికి ఉందా అని ఆయన అన్నారు. యోగిల గురించి నాని వంటి భోగిలు మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం లో ఉన్న ఐఎయస్, ఐపీయస్ లు.. ప్రభుత్వానికి అయ్యా.. యస్ అనవద్దు అని ఆయన హితవు పలికారు. కొడాలి నాని వ్యాఖ్యలు పై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
అదే చర్చి పై రాళ్లు వేస్తే 41 మందిని అరెస్టు చేశారు. అమరావతి లో మహిళల పై కేసులు పెట్టి అరెస్ట్ లు చేశారు. నాని పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేదే మా డిమాండ్ అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
హిందూ సమాజం ఓపిక ఉన్నంత వరకే… ఆ తర్వాత ఎవరూ ఆపలేరు అని ఆయన హెచ్చరించారు. ఎపి లో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్ లో ఉండకూడదని ఆయన అన్నారు.