నేషనల్ హైవే పనుల్లో వేగం పెంచి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం-దేవరపల్లి 4 వరసల గ్రీన్ ఫీల్డ్ హైవే విస్తరణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెనుబల్లి మండలం ముత్తగూడెం, కారాయిగూడెం, వేంసూరు మండలం వైఎస్ బంజార, చౌడవరం గ్రామాల్లో పర్యటించి, గ్రీన్ ఫీల్డ్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ని 3 ప్యాకేజీల క్రింద చేపట్టినట్లు తెలిపారు. ప్యాకేజి-1 క్రింద 33.604 కి.మీ. రహదారి రూ. 1,060.97 కోట్ల అంచనాతో, ప్యాకేజి-2 క్రింద 29.513 కి.మీ. రహదారి రూ. 761.35 కోట్ల అంచనాతో, ప్యాకేజి-3 క్రింద 42.119 కి.మీ. రహదారిని రూ. 948.53 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఇట్టి రహదారిలో 7 మేజర్, 30 మైనర్ వంతెనలు, ఒక ఆర్వోబి, 5 ఇంటర్ చేంజ్ ల నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపులు ఉన్నచో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి 250 మీటర్లకు అండర్ పాస్ ఏర్పాటు వుండాలన్నారు. పంట భూముల మధ్యలో నుండి రహదారి నిర్మాణం జరిగితే, అట్టి రైతు తన పంట భూమికిరువైపులా సులభంగా వెళ్లేలా ఏర్పాటుచేయాలన్నారు. షెడ్యుల్ ప్రకారం అక్టోబర్, 2024 నాటికి పనులు పూర్తిచేసి అందుబాటులో వచ్చేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు.కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, ప్రాజెక్ట్ రెసిడెంట్ ఇంజనీర్ అమరెందర్, మేనేజర్ దివ్య, క్యాంపు మేనేజర్ మహేష్, బ్రిడ్జి ఇంజనీర్ నారాయణ రావు, క్వాలిటీ ఇంజనీర్ నారాయణ, మండల తహసీల్దార్లు రమాదేవి, నారాయణ, అధికారులు తదితరులు ఉన్నారు.