తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై త్వరలో లోకాయుక్తలో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములు భద్రమేనా? అని ఆయన ప్రశ్నించారు. తిరుపతి రెవిన్యూ డివిజన్ పరిధిలోని తిరుపతి చంద్రగిరి కాళహస్తి నగరి సత్యవేడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ భూముల భద్రత గాలిలో దీపంలా మారిందని ఆయన అన్నారు.
తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం భూ కబ్జాదారులతో కళకళలాడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా జవాబుదారితనంగా పరిపాలన ఉండాలి అని పదే పదే చెప్తున్నారని అయితే అందుకు భిన్నంగా కొంతమంది అవినీతి అధికారులు ప్రవర్తిస్తున్నారని అన్నారు.
తమకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని బరితెగించి వ్యవహరించడంపై నిఘా వర్గాల నుంచి సమాచారం తెచ్చుకొని తిరుపతి పరిధిలోని అన్ని శాఖలలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.