ములుగు జిల్లా దేవగిరిపట్నం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేతావత్ సుధాకర్ జాతీయ సేవారత్న అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ లోని సిటీ సెంట్రల్ కల్చరల్ హాల్లో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ ఈ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి మునిమనుమడు కావూరి శ్రీనివాసశర్మ, గూడూరు చెన్నారెడ్డి, జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, మానవ హక్కుల నేత నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
ములుగు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిజం రంగంలో అంచలంచలుగా ఆయన ఎదిగారు. నిజాలను నిర్భయంగా వెలికితీస్తూ మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుధాకర్ మాట్లాడుతూ ఈ అవార్డుతో సామాజిక బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.