ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఏమా పిచ్చి ప్రశ్న. తల తిరుగుతున్నదా? 151 సీట్లతో గెలిచి తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేసి ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానిస్తారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనే. సరే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేది కరెక్టే.
మరి సూపర్ సిఎం ఎవరైనా ఉన్నారా? అరే మళ్లీ పిచ్చి ప్రశ్న. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధిష్టానవర్గమే లేదు. ఆయనే అధిష్టానవర్గం. ఆయన ఎవరి మాటా వినరు కూడా. ఇదంతా ఏదో సరదాగా చెబుతున్నది కాదు. నిన్న సాధారణ పరిపాలన శాఖ నుంచి జారీ అయిన జీవో ఆర్ టి నెం 414 చూస్తే మాత్రం మరేదో అనిపిస్తున్నది.
ఈ జీవో ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ (పొలిటికల్) పేరుతో విడుదలైంది. మంత్రులు అందరూ ప్రతీ బుధవారం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆ జీవో సారాంశం.
ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం సచివాలయంలో ఉండాలనే అంశంపై గతంలో ఒక సారి చర్చకు వచ్చింది. అప్పుడు చాలా మంది మంత్రులు దానికి అభ్యంతరం చెప్పారు. కచ్చితంగా ముందే ప్రకటించి వారంలో మూడు రోజులు అమరావతిలో ఉంటే తమ జిల్లాలు, నియోజకవర్గాలకు న్యాయం చేయలేమని, వీలైనంత ఎక్కువ సమయం అమరావతిలో ఉండేందుకు ప్రయత్నిస్తాము కానీ అలాంటి నిబంధనలు పెట్టవద్దని సీనియర్ మంత్రులు సూచించారు.
దాంతో అందరూ నిశ్శబ్దం పాటించారు. ఆదేశాలు వెలువడలేదు కదా అని మంత్రులు సంతోషించే లోపు జీవో నెం 414 వచ్చేసింది. బుధవారం కచ్చితంగా అమరావతిలో ఉండాలనేది దాని సారాంశం. అదీ కూడా ముఖ్యమంత్రి నేరుగా మంత్రులకు చెబితే సరిపోయేది. మంత్రులు ఎవరూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కిరించే పరిస్థితి లేదు కదా. అలా కాకుండా జీవో విడుదల చేయడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మంత్రుల అటెండెన్సు పైనే జీవోలు వస్తుంటే ఎలా? అదీ కూడా అధికారులు ఇచ్చేస్తూ ఉంటే ఎలా అని చర్చ జరుగుతున్నది.