రాష్ట్ర విభజన సమయంలో విజయవాడ గుంటూరు ప్రాంతానికి మంజూరైన సిబిఐ కోర్టును వెంటనే ప్రారంభించాలని ఏపి బిజెపి నేతలు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ను కోరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో పలువురు బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిశారు.
వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ-గుంటూరులో ప్రారంభించాలని బీజేపీ నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించారని, అది ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ – గుంటూరులో ప్రారంభించాలని ఆ లేఖలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరారు.
దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఏపి సిఎం జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం సిబిఐ కోర్టు హైదరాబాద్ లో ఉండటం వల్ల ఆయన అక్కడకు వెళ్లాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
అయితే,అందుకు సీబీఐ కోర్టు నో చెప్పింది. దీని మీద జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. సీబీఐ కోర్టు విజయవాడ – గుంటూరులో ఏర్పాటు చేస్తే ఏపీకి సంబంధించిన కేసులు ఆ రాష్ట్రానికి బదిలీ అవుతాయి. అప్పుడు విజయవాడలోనే కోర్టు ఉంది కాబట్టి… జగన్ పిటిషన్లో పేర్కొన్నట్లు మినహాయింపు కోసం మరోసారి కారణం చెప్పడానికి ఆస్కారం ఉండబోదు.
తాజాగా విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించాలని కోరుతూ బిజెపి అకస్మాత్తుగా కేంద్ర మంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇది జగన్ ను మరింత ఇరికించేందుకేనని కొందరు అంటున్నారు. సీఎం స్థానంలో ఉండి సొంత రాష్ట్రంలోనే కోర్టు మెట్లు ఎక్కడం అనేది జగన్ మోహన్ రెడ్డి అపప్రదగా మారుతుందని మరి కొందరు అంటున్నారు.