అంతా లాక్ డౌన్. బిడ్డకు శ్వాస ఆడడం లేదు. ఏం చేయాలి? బిడ్డను ఎలా బతికించుకోవాలి? ఆ తల్లిది ఒకటే ఆందోళన ఏం చేయాలో తోచలేదు. అప్పుడు వచ్చారు ఆపద్భాంధవులులాగా స్థానిక పోలీసులు. నిర్మల్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన పోలీసుల దయాగుణం ఎంతటిదో వివరిస్తుంది.
ఈరోజు ఉదయం జన్మించిన శిశువుకు శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది ఏర్పడగా వేరే హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. అందుబాటులో ఏ వాహనం కూడా లేకపోవడంతో వారు 100 కు ఫోన్ చేశారు. దాంతో ఇది తమ పని కాదు అని పోలీసులు ఆలోచించలేదు.
తక్షణమే సమాచారాన్ని పెట్రో కార్ సిబ్బందికి అందచేశారు. పెట్రోకార్ సిబ్బంది కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ ప్రకాష్ వెంటనే స్పందించి వారిని సంతోష్ రాజ్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ కు అప్పచెప్పారు.
దాంతో అక్కడ ఆ శిశువుకు తక్షణ సాయం అందింది. ఆపద లో ఆదుకున్న పోలీసులకు శిశువు తల్లి దండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.