ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం నాడు నల్గొండ లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫౌండర్ చైర్మన్ కొనేదెటి మల్లయ్య జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు కొవ్వొత్తి ర్యాలీని శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను రాథోడ్, ముఖ్య సలహాదారులు చీలుపురి వీరాచారి, డాక్టర్ చెరుకూరి రామ్ తిలక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్, వైస్ ప్రెసిడెంట్ కవిత, కోశాధికారి వంశీ ప్రసాద్, దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ వనజ రెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ పి పాండు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొనేదెటి మల్లయ్య మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత ఉందని అన్నారు. ఇతర వృత్తులతో పోల్చినప్పుడు నర్సింగ్ వృత్తి సేవ దృక్పథంతో కూడుకున్నదని అందువల్ల నర్సింగ్ విద్య, ఉపాధి విషయంలో ప్రభుత్వం సహకరించాలని అన్నారు.
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 సంవత్సరాన్ని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిందని, రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. అందువల్ల నర్సింగ్, మిడ్వైఫరీ వర్క్ఫోర్స్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రేవేటు ఆసుపత్రులలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన అన్నారు.