మధ్యప్రదేశ్ లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. మధ్యప్రదేశ్ లో ఒక చెక్ పోస్ట్ వద్ద ఆర్టీఓ అధికారులు, సిబ్బంది లంచం అడిగిన వ్యవహారంపై నాగ్పూర్కు చెందిన బీజేపీ నేత ఒకరు గడ్కరీకి ఫిర్యాదు చేశారు. వాహనం అన్ని పత్రాలు సరైనవి ఉన్నా కూడా తనను లంచం అడిగారని ఆ బిజెపి నేత తన ఫిర్యాదులో గడ్కరీకి తెలిపారు. అలాగే, లారీ డ్రైవర్లు, యజమానులను కూడా రవాణా శాఖ అధికారులు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో కూడా తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకువచ్చానని, అయితే ఇంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభించలేదని కేంద్ర మంత్రి గడ్కరి తన లేఖలో రాశారు. దీని వల్ల మధ్యప్రదేశ్ పేరు కూడా చెడిపోతోంది. సమస్యలపై అధికారులను ఆదేశించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో, రాష్ట్ర రవాణా కమిషనర్ను తొలగించాలని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్పుత్లకు కూడా గడ్కరీ లేఖ కాపీని పంపారు. అవినీతిలో మధ్యప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి వెళుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా ఈ అంశంపై వ్యాఖ్యానించారు. రవాణా శాఖ మంత్రిని కూడా తొలగించాలి. ఈ లేఖలోని నిజం కూడా బయటకు రావాలి అని ఆయన అన్నారు.
previous post
next post