తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు సభ్యులుగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కాకుండా కళంకితులకు చోటు కల్పించడం మహా అపచారమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తిరుమల నుంచి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డులో నియమించిన వారి గత చరిత్రతపై నిఘా సంస్థల ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
టిటిడి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 81 మంది సభ్యులను నియమించడంపై పునరాలోచన చేయాలని, శ్రీవారి ఆలయం పై “ప్రయోగాలు” చేయవద్దని ఆయన హితవు పలికారు.
కేంద్ర మంత్రి సిఫార్సు లేఖలను సైతం దుర్వినియోగం చేసి సభ్యత్వం పొందడం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి ఇలాంటి వారు ఇంకా ఎంతమంది టీటీడీ బోర్డ్ లో ఉన్నారో నిగ్గు తేల్చాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టీటీడీ సభ్యులకు దేశవ్యాప్తంగా ఎవరు ఎవరు సిఫార్సు లేఖలు ఇచ్చారు అన్న దానిపై “శ్వేతపత్రం” విడుదల చేయాలి అని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రోటోకాల్ విఐపి దర్శనాలను పూర్తిగా తగ్గించి సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.