రోడ్ షోలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు
కామారెడ్డిలో పచ్చగా ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని, వాటిని దోచుకోవడానికే కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల, సిద్దిపేట వధిలి కేసీఆర్ కామారెడ్డికి రావడం వెనక భూములు దోచుకునే కుట్ర ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, వారి పిల్లల విద్యకు బాసటగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. రైతులకు ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ చేస్తామని, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులకు 4 వేల పింఛన్ ఇస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు 3 వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని, నాలుగు వందలకే సిలిండర్ ఇస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని కోరారు.
సత్యం న్యూస్, కామారెడ్డి