కన్నూ నాదే… వేలూ నాదే…. నా వేలు నా కన్నును పొడుస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో అయితే కచ్చితంగా పొడుస్తుంది. అలా పొడవడంతో ఇసుక లేక పోలవరం ప్రాజెక్టు లో హెడ్ వర్క్స్ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకం, అమ్మకం పనులను జగన్ ప్రభుత్వం జెపి కంపెనీకి అప్పగించింది.
అయితే పోలవరం ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి ఇసుకను వాడుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే అనుమతులు ఉన్నా ప్రాజెక్టు నిర్మాణానికి గోదావరి నుండి ఇసుక తీసుకెళ్ళడానికి వీలు లేదంటూ జెపి కంపెనీ సిబ్బంది అడ్డగోలు వాదన వినిపించారు.
జెపి కంపెనీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మధ్యాహ్నం నుండి 250 టిప్పర్లు నిలిచిపోయాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల అండదండలు పుష్కలంగా ఉన్నందునేమో జెపి కంపెనీ సిబ్బంది అధికారులను సైతం లెక్కచేయలేదు.
పోలవరం ప్రాజెక్టు అధికారులను సైతం అడ్డగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బయటి వారికి అనుమతులు లేవంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి జెపి కంపెనీ సిబ్బంది లెక్కచేయలేదు.