శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల సంబంధ పనులు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు టైం బాండ్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. అన్ని సెషన్లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పోలింగ్ రోజు, ఇవిఎం ల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సామాగ్రి ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందిని గుర్తించి, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు, ఇవిఎం, తనిఖీ బృందాల కొరకు వాహనాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిర్యాదుల విభాగం క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. సి విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటయి, ఉపయోగంలో లేని 16 పాఠశాలల జాబితా తీసుకొని, సౌకర్యాల కల్పన విషయంలో చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ నవంబర్ 15 న ప్రారంభించి, 23 లోగా పూర్తి చేయాలన్నారు. ఎపిక్ కార్డుల ముద్రణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 80 సంవత్సరాల వయస్సు దాటిన సీనియర్ సిటీజేన్స్ ఓటర్ల ఓటింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విభాగాలు పురోగతిలో ఉన్న పనుల జాబితా సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.