సి విజిల్ యాప్ పై యువతలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ముదిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాల తనిఖీలు చేశారు. ప్రతి బూత్ లెవల్ అధికారి వారి పరిధిలో కనీసం 50 మంది యువతను ఎంపిక చేసి, సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని, యాప్ పై అవగాహన కల్పించాలని అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదుకు సంబంధించి, ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన అన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది క్రొత్త ఓటర్లుగా నమోదు అయింది, ఎంతమంది ఓటర్లు షిఫ్ట్ అయింది, డూప్లికేట్ ఓటర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళ్యాణలక్ష్మి, శాదిముబారక్ నివేదిక ప్రకారం పోలింగ్ కేంద్ర పరిధిలో ఎంతమంది క్రొత్త కోడళ్లు వచ్చింది, వారి ఓటు, వారి తల్లిగారి గ్రామంలో ఉందా, లేదా క్రొత్తగా వచ్చిన అత్తగారి గ్రామానికి మారిందా చూడాలన్నారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. జులై వరకు ఆమోదించిన దరఖాస్తులకు ఎపిక్ కార్డులు ఓటర్లకు చేరినట్లు ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, ప్రచార సంబంధ హోర్డింగులు, పోస్టర్లు, గోడ వ్రాతలు తొలగించాలని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించిన ఫోటో ఓటర్ జాబితాను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ముదిగొండ తహసీల్దార్ వై. రామారావు, సెక్టార్ అధికారి సూర్యనారాయణ, అధికారులు తదితరులు ఉన్నారు.