కార్మిక వర్గంపై బిజెపి ప్రభుత్వం దాడికి పూనుకుందని, ఈ దాడిని ఎదుర్కోవడానికి నవంబర్ 26న, దేశవ్యాప్తంగా జరిగే కార్మిక గర్జనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిఘటించాలని రాష్ట్ర సి ఐ టి యు కార్యదర్శి బి మధు సూర్యాపేట హుజుర్నగర్ కార్మిక సంఘానికి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం రామాపురంలో కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నమధు మాట్లాడుతూ మునుపెన్నడూ భారతదేశంలో కార్మికవర్గంపై, ఉద్యోగులపై, రైతులపై, దాడి ఏ ప్రభుత్వం చేయలేదని, మన హక్కులు మనం కాపాడుకోవడానికి పోరాటమే మార్గమని అన్నారు. బిజెపి కార్మికవర్గంపై దాడికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ స్పందించాలని కోరారు.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చినా ఈ రోజు వరకు పరిశ్రమలలో అమలు చేయకపోవటం అన్యాయం అన్నారు. 26న, జరిగే సమ్మెలో అన్నిపరిశ్రమలలో వివిధ రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, సి ఐ టి యు నాయకులు రాధాకృష్ణ, గుండెబోయిన వెంకన్న, యూనియన్ నాయకులు తీగల శ్రీనివాసరావు, అజాముద్దీన్, ప్రకాష్, లక్ష్మయ్య, వీరబాబు, శ్రీనివాస్, అంకారావు, వెంకటేశ్వర్లు, శౌరి, రాజశేఖర్, జావిద్, ప్రభాకర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.