నేరారోపణలు ఎదుర్కొంటున్నవారమని స్వయంగా అభ్యర్థులే ప్రకటించడం భారత రాజకీయ చరిత్రకు మాయని మచ్చ. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని నేరస్థులుగా పరిగణించ వీలులేదని ఉన్నత న్యాయస్థానాలు వ్యాఖ్యానించడంతో రాజకీయాలలో నేరగాళ్ళ ప్రవేశానికి అవరోధం లేకుండాపోయింది.
2500 మంది నేర చరితులు పునీతులేనా?
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడిచేసిన తాజా నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 2500 పైగా నేరచరితులు అసెంబ్లీ, పార్లమెంట్లలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2019 లో పార్లమెంట్ కు ఎన్నికైన సభ్యులలో నేరస్తుల సంఖ్య సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
జనతాదళ్(యూ)మొత్తం పార్లమెంట్ సభ్యులలో 81.3% నేరస్థులతో మొదటిస్థానంలో ఉండగా, శివసేన 61.1%తో రెండవస్థానంలో, కాంగ్రెస్ 57.7% నేరస్థులతో మూడవస్థానంలో ఉంది. బీజేపీ పార్లమెంట్ సభ్యులలో 38.7% , వామపక్షాలలో 39.2% మంది నేరస్తులు ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.
వారిలో అత్యధికులు (85%) మహిళలు లక్ష్యంగా నేరానికి ఒడిగట్టినట్లు నివేదిక స్పష్టం చేయడం శోచనీయం. ఎన్నికైన చట్టసభ సభ్యులలో కేవలం 4.7 % మంది మాత్రమే సచ్ఛీలురు ఉండడం విడ్డూరం. ప్రస్తుత రాజ్యసభ సభ్యులలో సైతం 24% నేరస్థులు ఉండడం గమనార్హం.
భారత్ లో ఎన్నికలు ఒక ప్రహసనంగా పరిణమించిన నేపథ్యంలో రాజకీయపార్టీలు విలువల్నితుంగలోతొక్కడం ప్రజాస్వామ్య ప్రియులను ఆవేదనకు గురి చేస్తోంది.
చట్టసభలు అతిపవిత్రమైనవని నేతలు తరచూ అనడం కేవలం మాటలకే పరిమితం కావడం చూస్తున్నాం. నేరప్రమేయం ఉన్నవారికి రాజకీయపార్టీలలో ప్రవేశం లేదని నిర్ద్వంద్వంగా, నిర్భయంగా చెప్పడానికి నేతలు సాహసించలేరని పరిశీలనలు చెబుతున్నాయి.
ఎన్నికల సంస్కరణలలో చోటు చేసుకోదగిన అనేక ప్రగతి కాముక అంశాలలో నేరగాళ్ల ప్రవేశాన్నినిరోధించే ప్రయత్నం జరగాలని రాజకీయ పండితులు అంటున్నారు. రాజకీయ పార్టీలు నేరాలకు పాల్పడినవారికి మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసించాలని, భారతదేశ రాజకీయాలలో సఛ్చీలురు అధిక సంఖ్యలో పాలుపంచుకోవాలని వారు అభిలషిస్తున్నారు.
ఆ దిశగా రాజకీయ పార్టీలు, రాజకీయ మేథావులు చర్చోపచర్చలకు తెరతీస్తే ఫలితాలు మెరుగ్గా ఉండగలవు.
పొలమరశెట్టి కృష్ణారావు