రాష్ట్ర రాజధాని అమరావతిలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. రైతుల త్యాగ ఫలంతో టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించిందని ఇది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.
రైతులు ఇచ్చిన భూముల లో ఏర్పాటు చేసిన అసెంబ్లీ లోనే అదే రైతులను నిలువునా ముంచడానికి నిర్ణయించిన సిఎం జగన్ చరిత్రహీనుడిగా మిగులుతారని డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభిప్రాయపడ్డారు. విస్తరణ పరంగా చూసినా నాలుగు వైపుల నుండి సుమారు 250 నుండి 300 కిలోమీటర్ల దూరంలో అమరావతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని ఆయన అన్నారు.
అమరావతి లో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలలో ఒక మహా నగరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఆ మహానగర ద్వారా సంపదను సృష్టించాలని ఆయన అన్నారు. ఈ ఐడియాతోనే చంద్రబాబు పని చేశారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానంతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడం మానేశారని, అమరావతి నిర్మాణం ఆపడంతో నూతన పరిశ్రమల ఏర్పాటు ఒక్కటంటే ఒక్కటి కూడా జరగదని ఆయన అన్నారు.
పోలవరం నిర్మాణం నిలుపుదల చేసి 20 సంవత్సరాల రాష్ట్ర ప్రగతిని వెనక్కి తీసుకు వెళ్ళటం జగన్ చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసి మొత్తంగా ప్రాంతాల మధ్య వైషమ్యాలుకు తెర తీయడం జగన్ అవగాహన లేమీకి నిదర్శనమని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెబుతారని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ అరవింద బాబు అన్నారు.