వాదోపవాదాల అనంతరం లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఒక అమ్మాయికి పాకిస్తాన్ లోని పెషావర్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగ హక్కులు, ట్రాన్స్ జెండర్ హక్కులు, మెడికో లీగల్ అంశాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాత లింగమార్పిడి శస్త్రచికిత్సకు అనుమతి ఇస్తున్నట్లు పెషావర్ డివిజన్ బెంచ్ జస్టిస్ కైసర్ రషీద్, జస్టిస్ నయీమ్ అన్వర్ లతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది.
పుట్టుకతో ఆడపిల్లగా ఉన్నా చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఏవీ తన క్లయింట్ కు లేవని, మగపిల్లవాడిలాగానే పెరిగిందని సీనియర్ లాయర్ సైఫుల్లా ముహిబ్ కాకాఖేల్ కోర్టుకు తెలిపారు. ఇది లింగ బేధానికి సంబంధించిన ఒక మానసిక రుగ్మత అని ఆయన కోర్టుకు వివరించారు. దీనికి సెక్స్ రీ ఎసైన్ మెంట్ సర్జరీ (ఎస్ఆర్ఎస్) ఒక్కటే చికిత్స అని ఆయన కోర్టుకు తెలిపారు.
అయితే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లకుండా కోర్టుకు ఎందుకు వచ్చారని జస్టిస్ రషీద్ ప్రశ్నించగా లింగ మార్పిడి జరిగిన తర్వాత పేరు, జెండర్ మారుతుందని, వారసత్వ హక్కుల్లో మార్పులు వస్తాయని అందువల్ల ముందుగానే కోర్టుకు తెలియపరుస్తున్నామని ఆ అమ్మాయి తరపు న్యాయవాది తెలిపారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఆపరేషన్ విధానాన్ని గమనించి తదనంతర పరిణామాలను తమకు విన్నవించాలని స్థానిక అధికారులను పెషావర్ కోర్టు ఆదేశించింది.