సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి గ్రామంలో పరమ పావన కృష్ణా నది తీరాన స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త విద్యాలయంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం చేశారు.
నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది)పండుగ సందర్భంగా వేద, స్మార్త అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ ఆధ్వర్యంలో వేద స్మార్త విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉదయం సంధ్యావందన అనుష్టాదికములు ముగించుకొని లింగార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిష్టగా నిర్వహించారు.
ముందుగా మహా గణపతిని పూజించి మహాన్యాస,రుద్ర,నమక, చమక,పంచసూక్తాలతో మహా శివునికి అభిషేకం నిర్వహించి,అష్టోత్తర శతనామావళి అర్చన గావించి ధూపదీప,నైవేద్యాలు,మహా మంగళ నీరాజన,మంత్ర పుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రదోష కాల సమయంలో శ్రీ మహాగణపతి పూజ,పఞ్చాఙ్గ పూజ నిర్వహించి శ్రవణానందకరంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో జరగబోయే అంశాలను,ద్వాదశ రాశుల ఫలాలు,ఆదాయ వ్యయాలు,రాబోవు సూర్య,చంద్ర గ్రహణ విషయాలను, కర్తరి,మౌఢ్యమి,కార్తెల ప్రవేశ సమయం, తేదీలను సవివరంగా వివరించారు.
పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలను గౌరవించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వేద స్మార్త విద్యాలయ కమిటీ సభ్యుడు బాచిమంచి చంద్రశేఖర్,శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ కోశాధికారి బాచిమంచి గిరిబాబు,సభ్యులు రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యామ్ సుందర్, బొబ్బిళ్ళపాటి శేషు, పులిజాల శంకర్రావు,వేద స్మార్త విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్