విజయనగరం జిల్లాలో మూడు దశల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియాలని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ అన్నారు.
అందుకు ప్రజలు, అన్ని పార్టీల నాయకుల, ప్రజాప్రతినిధుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం కావాలని కలెక్టర్ కోరారు.గతంలో అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అక్కడ పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, శిక్షణ తదితర అంశాలపై కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే స్టేజ్ -1 అధికారులకు శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం టీవోటీలకు ఇస్తున్నామని, అనంతరం స్టేజ్-2 అధికారులకు శిక్షణ అందజేస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారికీ ప్రతి అంశంపైనా అవగాహన కల్పించేందుకు వీలుగా శిక్షణలతో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ ని ప్రతి ఒక్కరికీ అందజేశామని వివరించారు.
సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో గతంలో ఉండే ప్రాంతాలతో పాటు తాజాగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పారు.. ఆయా చోట్ల ఇప్పటికే చర్యలు చేపట్టామని, తగిన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యా రాకుండా జాగ్రత్త వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
అలాగే వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్, వీడియో గ్రాఫర్లను నియమించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
పాత జాబితాయే ప్రామాణికం
ఓటర్ల వివరాలకు సంబంధించి పాత జాబితాయే ప్రామాణికమని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ స్పష్టత ఇచ్చారు. ఎలక్టోరల్ జాబితాపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. 2020 జనవరిలో ప్రచురించిన జాబితా ప్రకారమే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందుపరిచామని చెప్పారు.
జిల్లాలో మొత్తం 14,80,099 ఓటర్లు ఉన్నారని అందులో 7,33,615 పురుషులు, 7,46,416 మహిళా ఓటర్లు, 68 ఇతరులు ఉన్నారని వివరించారు.