వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్యకుపాల్పడింది. షెడ్యూల్డ్ తెగల కులానికి చెందిన రొడ్డా భవానీ (32) గురువారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వైసీపీ నేతల వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ లైన్మెన్ గా పనిచేస్తున్న భవానీ భర్త భారతి వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం ఎంపీపీ దంగేటి అచ్యుత జానకి భర్త రాంబాబు ఉప సర్పంచ్ చీకురుమెల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ భర్త వరసాల సత్యనారాయణలు భవానీని బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతలతోపాటు డీఎల్పీవో విక్టర్ కూడా వేధింపులకుగురిచేసినట్టు మృతురాలి భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు కార్యదర్శుల బదిలీల్లో భాగంగా భవానీకి చల్లపల్లి నుంచి మామిడికుదురు మండలం అప్పనపల్లికి బదిలీ అయింది. ఆమె ఒకటి రెండు రోజుల్లో అక్కడ చేరనున్నారు. అయితే భవానీపై డీఎల్పీవోకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు వైసీపీకి చెందిన పంచాయతీ సభ్యులు కొందరు డబ్బులు డిమాండు చేయడం ఆమేరకు ఆమె సొమ్ములు చెల్లించినట్టు తెలిసింది. మరో ముగ్గురు కూడా డబ్బులు డిమాండు చేయడంతో తలెత్తిన వివాదమే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పిందని అంటున్నారు.