పిల్లకు మొక్కలు పెంచడం అలవాటు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ప్రకృతిని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడమే. వాటర్ బాటిల్స్ కొనడం మనం చూస్తున్నాం. మనం మొక్కలు పెంచకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ బాటిల్స్ కొనాల్సి వస్తుందేమోనని ఆయన అన్నారు.
హైదరాబాద్ -నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 9 వ గ్రాండ్ నర్సరీ మేళాను నేడు ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర వాసుల కోసం ఈ నర్సరీ మేళాలో ఏర్పాటు చేశారు. ఈ నర్సరీ మేళాలో ఆర్గానిక్, బోన్సాయ్, ఔషధ, అన్ని రకాల పూల, పండ్ల మొక్కలు కొలువు తీరాయి.
మొక్కలతో పాటు వీటికి సంబంధించిన అన్ని రకాల పని ముట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మొక్కలు ఆనందాన్ని, మానసికోల్లోసాన్ని కలుగ జేస్తాయని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్నారు. మొక్కను పెంచడమంటే భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే. మన పిల్లలకు ఆస్థి ఇస్తే నిలుపుకుంటారో లేదో కాని మంచి పర్యావరణాన్ని ఇస్తే వాళ్లకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు.
డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. కాని ఆరోగ్యం పోతే తిరిగి రాదు. మంచి పర్యావరణం తోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇది గుర్తించే హరితహారం , సామాజిక అడవుల పెంపకం, అర్బన్ ఫారెస్ట్, పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి అన్నారు. నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు తెలిపారు.