దేశ భద్రత దృష్ట్యా తమ దేశం లో బురఖాను తక్షణమే నిషేధించాలంటూ శ్రీలంక పార్లమెంటరీ కమిటీ తాజాగా సిఫార్సు చేసింది. మతాధారితంగా ఏర్పడిన రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, ఆ మేరకు చట్టం తేవాలని ప్రతిపాదించింది.ఇప్పటికే అనేక దేశాలు బురఖాను నిషేధించాయని ఈ కమిటీ నివేదిక పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించని వస్త్రధారణలో ఉన్న వ్యక్తులను గుర్తించేందుకుగాను వారి ముఖాన్ని చూపించమని కోరే అధికారం పోలీసులకు ఉండాలని సూచించింది.
అందుకు నిరాకరిస్తే వారెంటు లేకుండానే ఆయా వ్యక్తులను అదుపులోకి తీసుకునేలా వారికి అధికారాలు ఇవ్వాలని పేర్కొంది. మతాధారితంగా ఏర్పడిన పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా చట్టం తేవాలని దేశ ఎన్నికల కమిషన్కు కమిటీ సూచించింది. లేకపోతే మతాధారిత పార్టీలను రాజకీయ పార్టీలుగా మారేందుకు నిర్దేశిత గడువు ఇవ్వాలని సూచన చేసింది. ఏదేని జాతి/మతాధారిత వివాదాలలో చిక్కుకొన్న పార్టీల రిజిస్ట్రేషన్లనూ రద్దు చేయాలని పేర్కొంది.
మదర్సాలను సాధారణ స్కూళ్లుగా మార్చాలని, వాటిని మూడేళ్లలోపు విద్యాశాఖ పరిధిలోకి తేవాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిం మత, సాంస్కృతిక వ్యవహారాల శాఖ పరిధిలోకి మదర్సాలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.