రానున్న బక్రీద్ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో, పీస్ కమిటీ మెంబర్ లతో జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ రోజు గద్వాల్ పట్టణ పోలీసు స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నందుకు అన్ని మతాల పెద్దలను ప్రజలను అభినందించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను, లేగదూడలను అక్రమ రవాణా చేయవద్దని సూచించారు. మరియు పశువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్లేటప్పుడు సంబంధిత వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి తెలిపారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాలలో మున్సిపల్ అధికారులతో కలిసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని, కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సూచించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ మాట్లాడుతూ నడిగడ్డ ప్రజలు ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటారని, ఇప్పటి వరకు ఈ నడిగడ్డ లో శాంతిభద్రతల కు విఘాతం కలుగలేదని అన్నారు. హిందు ముస్లింలు సోదరులు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారని రాబోయే బక్రీద్ పండుగ ను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పట్టణ ప్రథమ పౌరుడిగా తన వంతు సహకారం పోలీస్ శాఖకు ఎప్పటికి ఉంటుందని తెలిపారు.
ఇంకా ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ సుభాన్, కాంగ్రెస్ నాయకుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, గద్వాల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాబర్, గద్వాల్ పట్టణ వార్డ్ కౌన్సిలర్లు, భజరంగ్ దళ సభ్యులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ డి. ఎస్పీ యాదగిరి, సర్కిల్ ఇన్స్పెక్టర్ జక్కుల హన్మంత్, టౌన్ ఎస్సైలు హరిప్రసాద్ రెడ్డి, రమాదేవి, రజిత, శైలేంద్ర, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.