ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడతామని తెలంగాణ స్టేట్ డాక్టర్స్ ఫోరం స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టి ఎస్ ఎం సి) కు జరుగుతున్న ఎన్నికల్లో 13 మంది తో కూడిన వైద్యులతో ప్యానల్ గా ఏర్పడి తాము పోటీ చేస్తున్నట్లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు శ్రీనివాసులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు చీమ శ్రీనివాస్, గోంగూర వెంకటేశ్వర్లు, లింగం గౌడ్, కీర్తన లు మాట్లాడారు. ప్రభుత్వం వైద్యరంగంలో తీసుకువచ్చే విప్లవాత్మకమైన మార్పులకు సలహాలు సూచనలు ఇచ్చే అత్యంత కీలకమైన టీ ఎస్ ఎం సి కి రాష్ట్ర ఏర్పడనంతరం మొదటిసారి ఎన్నికల జరుగుతున్నాయని అన్నారు.
వృద్ధ వైద్యులకు ఉచితంగా రెన్యువల్, టి ఎస్ ఎం సి కి నూతన భవన నిర్మాణం, ఆరోగ్య సమస్యలపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు, రెన్యువల్, రిజిస్ట్రేషన్ ఫీజును తగ్గిస్తామన్న ముఖ్య హామీలతో బరిలో దిగుతున్నట్లు చెప్పారు. 48,405 మంది వైద్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. నవంబర్ 30వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయని, వైద్యుల ఇంటి వద్దకే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని చెప్పారు. రాష్ట్ర వైద్యరంగం బలోపేతంతో పాటు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్యానెల్ కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.