తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించిందని అయితే నేటి వరకు నిరుద్యోగ భృతి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ బి శివ వర్మ అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ వర్మ, మాట్లాడుతూ అన్ని దేశాలలో నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నారు, కానీ మనదేశంలో బిజెపి ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని యువత హక్కులను కాలరాస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
తెలంగాణ రాక ముందు ఉద్యోగం కల్పిస్తానని హామీలు ఇచ్చి, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉద్యోగాలు భర్తీ చేయడంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1126 మంది నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలు చేసుకుని బంగారు తెలంగాణ సాధించుకుంటే యువత ఉద్యోగాలు లేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగ భృతి చెల్లించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి భాస్కర్,బత్తిని రాము,పరమేష్,కురుమయ్య, రాజు, శేఖర్,మధు,తదితరులు పాల్గొన్నారు.