నకిలీ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నేత రసపుత్ర రజిని ని బెంగళూరు పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 44 లక్షల విలువైన రూ. 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా వ్యవహరించిన రజిని పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోసారి రజినికి అదే పదవి ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన రసపుత్ర రజిని.. అధికార పార్టీ వైసీపీ లో యాక్టివ్ గా వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె నుంచి రూ. 44 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం పట్టణానికి చెందిన కొంత మంది వ్యక్తుల నుంచి నకిలీ నోట్లు కొనుగోలు చేసి రజిని బెంగళూరు లో వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, దొంగనోట్ల వ్యవహారంతో తనకేం సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రజిని పాత్ర ఉందని తేలితే పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.