లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు.
నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్, పీఆర్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన
దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.అనంతరం లే అవుట్ రెగ్యులేషన్ స్కీం-2020 పై మునిసిపల్, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాత అనధికార లే అవుట్ల విషయమై లే అవుట్ రెగ్యులేషన్ స్కీం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్లాట్ల వారిగా కాకుండా లే అవుట్ ల వారిగా చర్యలు చేపట్టాలన్నారు. లే అవుట్లలో ప్రభుత్వ భూములు, నీటి వనరులు, రహదారులు, అప్రోచ్ రోడ్స్ ఉన్నాయా లేదా చూడాలన్నారు. నీటి వనరులు ఉన్నచోట నీటి పారుదల శాఖచే ఎన్ఓసి పొందాలన్నారు. దరఖాస్తుల ఆమోద దిశగా చర్యలు చేపట్టాలన్నారు.