మున్సిపల్ చైర్ పర్సన్ అంటే అక్కడ పని చేసే సిబ్బంది అంతా తన సేవకులు అనుకుంటున్నది ఆమె. ఎవరు ఎన్ని సార్లు చెప్పినా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినా ఏ మాత్రం మారడం లేదు కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్.
మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి చైర్ పర్సన్ గా ఎన్నిక అయిన కొత్తలోనే కొల్లాపూర్ మునిసిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖరచారి మున్సిపాలిటీ సిబ్బంది తో సొంత పనులు చేయించుకోవడం మొదలు పెట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న తన ఇంటికి మునిసిపల్ సిబ్బందితో క్యూరింగ్ చేయించుకున్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాని తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా సిబ్బందితో ఇంటి పని చేయిస్తున్న ఫోటోలు మీడియా లో వచ్చాయి. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు కూడా.
ఐనా కూడా ఆమె తీరు మారడం లేదు. మంగళవారం నాడు తాజాగా 5 గురు మునిసిపల్ కార్మికులను తన ఇంటికి పిలిపించి వారి తో ఇటుక, ఇసుక మొదటి అంతస్థు కు మోయించుకున్నారు.
వార్డులో గత 3 నెలల నుండి పారిశుద్ధ్య పనులు చేయడానికి సిబ్బంది ని పంపించడం లేదు కానీ తన ఇంటికి పనులు చేయించుకోవడం కోసం వారి ని వాడుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు.
ఈ విధంగా తమ సొంత పనులకు సిబ్బంది ని ఉపయోగించడం అధికార దుర్వినియోగమే. ఇలా వారి శ్రమ ను దోచుకుంటున్న కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొల్లాపూర్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ షేక్ రహీం పాషా అన్నారు.
మునిసిపల్ కార్మికులందరికి మునిసిపాలిటీ వసూలు చేసిన పన్నుల నుంచి జీతాలు ఇస్తారని, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు.