హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీ నుండి ఫాల్గుణ మాస ఉత్సవాలు జరుగనున్నాయి. ఇదివరకు నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఈ క్రమంలో ఫాల్గుణ మాస ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.
మార్చి 14 నుండి నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 6 నుండి 6.40 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై ఫాల్గుణ మాసం – లక్ష్మీ వైభవం పేరిట ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారు.
మార్చి 19న ఫాల్గుణ శుద్ధ షష్ఠినాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని ధ్యానారామంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు మృల్లింగార్చన చేపడతారు.
మార్చి 24న ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని ధాత్రీవనంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆమలకీ ఏకాదశి నిర్వహిస్తారు.
మార్చి 28న ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు విజయవాడలో రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు లక్ష్మీ జయంతి చేపడతారు.
ఏప్రిల్ 4న ఫాల్గుణ బహుళాష్టమి నాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని ధ్యానారామంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు శీతలాష్టమి(శీతలాదేవ్యర్చనం) నిర్వహిస్తారు.