వైసీపీ నాయకులు చేసే ఆగడాలకు గుడ్డలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. వైసీపీ క్రూరమైన దాడిలో గాయపడిన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులను ఆయన పరామర్శించారు. రెండు రోజులు క్రితం టీడీపీ వాళ్ళు వస్తుంటే దారి కాచి వైసీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ దాడిలో అమృతలూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన బొంత వెంకట నరసింహ, శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ అధికారంతో బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కూడా అందించకుండా చేశారు.
దాంతో వారిని తెనాలి లోని శ్రీ చక్ర ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న టిడిపి నాయకులను మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. తన నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరగటం బాధాకరమైన అంశం అని ఆయన అన్నారు. డెల్టా ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉంటారని, రాయలసీమ, పల్నాడు లాగా గొడవలు కక్షలు ఇక్కడ ఉండవని ఆయన అన్నారు. అలాంటి చోట ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి కింద పని చేసే నేతలు ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు.
మంత్రి మేరుగ నాగార్జున సహకారం తోనే టీడీపీ నాయకుల పై దాడులకు పాల్పడుతున్నారని ఆనందబాబు అన్నారు. తెనాలిలో,యడవూరు రెండు చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు పై దాడులకు దిగారని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ లో బాధితులు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆనందబాబు తెలిపారు. పోలీసులు మారాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ కి ఊడిగం చెయ్యాల్సిన పనిలేదు. ఎక్కడైనా దాడులు జరగకుండా పోలీసులు చూడాలి కానీ అలసత్వం వహిస్తున్నారు అని అన్నారు. తెనాలి 2టౌన్, వేమూరు,అమర్తలూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన వారి పై కేసు కట్టి దర్యాప్తు చెయ్యాలని డిమాండ్ చేశారు.