అనంతపురం రేంజ్ పరిధిలో జరుగుతున్న బాడిలీ అఫెన్సెస్ నియంత్రణపై పోలీసులు దృష్టి పెట్టాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ కోరారు. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలతో నేడు ఆయన ” ఫోన్ కాన్ఫరెన్స్” నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సమీక్షించారు. బాడిలీ అఫెన్సెస్ కు కారణాలైన భూ వివాదాలు, అక్రమ సంబంధాలు, తాగి గొడవలు పడటం, ఫ్యాక్షన్ , పొలిటికల్ రైవలరీ, విద్యార్థుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో విశ్లేషించాలని ఆయన కోరారు.
అధికంగా చోటు చేసుకుంటున్న కారణాలను అన్వేషించి బాడిలీ అఫెన్స్ కట్టడికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అన్నారు. అదే విధంగా లోన్ యాప్ మోసాల అడ్డుకట్టకు కృషి చేయాలని ఆదేశించారు. లోన్ యాప్ లు నిర్వహిస్తున్న కంపెనీలు, లోన్ యాప్ డెవలపర్స్ , లావా దేవీలు జరిపిన బ్యాంకర్లు, గూగుల్ స్టోర్స్ వారిని నిందితులుగా చేర్చాలని డి ఐ జి ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళికలతో చర్యలు చేపట్టాలి. ఏ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ తరహా రోడ్లపై అధికంగా చోటు చేసుకుంటున్నాయి, అధికంగా ఏ తరహా వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయో విశ్లేషించాలని ఆయన ఎస్ పిలను కోరారు.
అంతేకాకుండా ర్యాష్ & నెగ్లిజెన్స్ డ్రైవింగ్ , డ్రంకన్ డ్రైవింగ్ , రోడ్డు ఇంజనీరింగ్ లోపాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అధ్యయనం చేసి నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలు, ఫోక్సో కేసుల్లో సకాలంలో పూర్తి అయ్యేలా జడ్జిలతో సంప్రదించి త్వరితగతిన పూర్తీ చేయాలని కోరారు. జిల్లా ఎస్పీలు, డీఎస్ఫీలు చెరో 5 కేసులను పర్యవేక్షించి ప్రాపర్ గా పూర్తి చేయాలని సూచించారు.
సాధారణ దొంగతనాలు, పగలు లేదా రాత్రి దొంగతనాలు తగ్గించేందుకు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాలలో స్పెషల్ క్రైం టీం లను ఏర్పాటు చేసి దొంగల ముఠాలపై ప్రత్యేక నిఘా వేయాలని, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. తరుచూ ఎర్రచందనం అక్రమ రవాణా, తదితర నేరాలకు పాల్పడుతున్న నిందితులపై పి.డి.యాక్టు ప్రయోగించాలని ఆయన అన్నారు.
ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, రాహుల్ దేవ్ సింగ్, రిషాంత్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి ఆయా జిల్లాల పోలీసు కార్యాలయాల నుండి పాల్గొన్నారు.