గత 12 రోజులుగా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణమే. కరోనా వైరస్ సామాన్య ప్రజలను కబళిస్తుంటే ప్రభుత్వాలు అప్రమత్తమై దేశంలో ఎన్నడూ లేని విధంగా కర్ఫ్యూ వాతావరణం విధించింది. మరికొన్ని రోజులు ఇదే విధానం కొనసాగనుండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.
ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోతేనే కరోనాను నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. ఏ నోట విన్నా కరోనా మాట తప్ప మరే ఇతర మాట వినపడటం లేదు. రోడ్లపైకి వస్తే తప్పదు భారీ మూల్యం అంటూ ప్రభుత్వాలు ప్రకటించే పరిస్థితి నెలకొంది.
దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం మానేశారు. నిత్యం జనాల రద్దీతో దర్శనమిచ్చే కామారెడ్డి జిల్లా కేంద్రం ముగబోయింది. అత్యవసర దుకాణాలు తప్ప మరే ఇతర షాపులు తెరుచుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం అలయాలపైనా పడింది.
భక్తులు నిత్యం ఆరాధించే భగవంతునికి కరోనా కష్టాలు తప్పడం లేదు. 12 రోజులుగా కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాలు మూసివేయబడి ఉన్నాయి. ప్రతి నిత్యం ఉదయం నిర్వహించే పూజలు తప్ప మరే ఇతర పూజలకు భగవంతుడు నోచుకోవడం లేదు.
చివరికి సీతారాముల కల్యాణం సైతం ఆలయాలకు మాత్రమే పరిమితమై కేవలం పూజారులు సమక్షంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బస్సుల రవాణా నిలిచిపోయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ళు బందయ్యాయి.
నిత్యం వేలాది మంది ప్రయాణించే రైలు కూతలు వినపడటం లేదు. రైల్వే స్టేషన్ ప్రాంతం లో సిబ్బంది తప్ప ఇతరులెవరు కనపడటం లేదు. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ట్రాఫిక్ పొల్యూషన్ సమస్య లేదు. అంత నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం సమయంలో కొందరు, జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడల్లా ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా టాకీస్ లు ముగబోయాయి. అభిమాన హీరో సినిమా చూడటానికి వచ్చే అభిమానుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి.
12 రోజులుగా సినిమా టాకీస్ లు మూతపడటంతో ఆ ప్రాంతం బోసిపోయింది. సినిమా హీరోల షూటింగులు సైతం నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అడ్డాగా మారిన కామారెడ్డి జిల్లా కేంద్రం నిర్మానుష్యంగా మారింది. ప్రజలకు అత్యవసరమైన నిత్యావసర వస్తువులకు సంబంధించిన దుకాణ సముదాయాలు తప్ప మరే ఇతర దుకాణాలు తీర్చుకోవడం లేదు.
నిత్యం కోట్లలో లావాదేవీలు జరిపే బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పోలీసు స్టేషన్లలో వివిధ కేసులను ఛేదిస్తూ బిజీగా ఉండే పోలీసులు నేడు ప్రజలకు రక్షణగా రాత్రనక పగలనక రోడ్లపై జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంత జరుగుతున్నా, ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయిన ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయే పరిస్థితి ఎదురైన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విదిస్తే ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
చీటికీ మాటికి బయటకు వచ్చి కరోనా విజృంభించేలా చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ప్రజలకు చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. మాకోసమే ప్రభుత్వం పని చేస్తుందన్న కనీస జ్ఞానం లేకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు.
మే చివరి వరకు సరిపడా సరుకులు నిల్వ ఉంచడం జరిగిందని, ప్రజలు ప్రతిదానికి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని ప్రభుత్వం, అధికారులు మొత్తుకుంటున్నా వినడం లేదు. ఇకనైనా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సత్యం న్యూస్ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇప్పటికే జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు నమోదు కాకుండా ఉండాలంటే ప్రజల స్వీయ నిర్బంధం తప్పనిసరి. మన ప్రాణాలను మనమే రక్షించుకుందాం.. కరోనాను తరిమి కొడదమని మరోసారి చేతులు జోడించి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు అర్తం చేసుకుంటారని ఆశిస్తున్నాము.