ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో అడుగడుగునా భద్రతా సవాళ్లు ఎదురయ్యాయి. పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పంజాబ్ పోలీస్ శాఖ వైఫల్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని మోడీ పంజాబ్ టూర్లో భాగంగా భటిండాలో ల్యాండ్ అయ్యారు ప్రధాని. అక్కడి నుంచి హుస్సైనీవాలాలోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించాల్సి ఉంది. ఈ స్థూపం వద్దకు ప్రధాని హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండగా.. అందుకు వాతావరణం సహకరించలేదు. వెదర్ క్లియరెన్స్ వచ్చే వరకూ.. అంటే 20 నిమిషాల పాటూ ప్రధాని మోడీ అక్కడే వెయిట్ చేశారు. క్లియరెన్స్ రాకపోవడంతో రోడ్డుమార్గాన వెళ్లేందుకు సిద్ధమయ్యారు మోడీ. చివరి క్షణాన రూట్ మారడంతో డీజీపీకి సమాచారం చేరవేశారు అధికారులు. అవసరమైన సెక్యూరిటీ కల్పించేందుకు డీజీపీ సైతం పచ్చజెండా ఊపారు.
అమరవీరుల స్థూపానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రధాని మోదీ కాన్వాయ్ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. ఫ్లై ఓవర్ మీదకు చేరుకోగానే.. అక్కడ ఆందోళనకారులు పెద్ద ఎత్తున దర్శనమిచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మోదీ తిరుగుపయనమయ్యారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. భద్రతాలోపంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముందస్తుగా SSP స్థాయి అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రధాని ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. ప్రధాని పర్యటనను రాజకీయం చేయొద్దన్నారు సీఎం చరణ్జీత్సింగ్ చన్నీ. ప్రధాని అంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రధాని ఆకస్మికంగా రోడ్డుమార్గాన ప్రయాణించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు.