రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను 15 వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ కు ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు నేడు అందచేశారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుల అద్భుతమైన ప్రాజెక్టులని చైర్మన్ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆయన అభినందనలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని 80 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు లిఫ్ట్ ద్వారా పంప్ చేస్తున్నామని అందువల్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని అందువల్ల ఆ నిర్వహణ ఖర్చుకు నిధులు ఇవ్వాలని కోరారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి నీళ్లను అందిస్తున్నాం కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ 12 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ముఖ్యంగా నీటి కోసమేనని, గత ఐదు సంవత్సరాల కాలంలో పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామా ఎత్తిపోతల పథకం పూర్తి చేశామని వారు తెలిపారు. కల్వకుర్తి, నెట్టేపాడు పెండింగ్ ప్రాజెక్టులకు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం కాబట్టి వాటి నిధులు కూడా కేంద్రం ఇవ్వాలని లేఖలో కోరారు. కమిషన్ కాలపరిమితి సంవత్సరం పెరిగింది కాబట్టి రీజినల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని పరిశీలిస్తానని చైర్మన్ అన్నారు.