సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి శ్రీ పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి ఉత్సవాలకు ఆలయ అధికారులు స్థానిక రెవిన్యూ, పోలీసు, అధికారుల తో కలసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సర్వదర్శన క్యూ లైన్లు, అక్షరాభ్యాస కుంకుమార్చన క్యూలైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉదయం నాలుగు గంటలకు సరస్వతీ అమ్మవారి కి మంగళ వాయిద్య సేవ, ప్రత్యేక అభిషేకం, ఉదయం 8 గంటల నుండి వేద పఠనం, చండీ మహా విద్య పారాయణ పథం, పుణ్యాహవాచనం, మహా విద్య హోమంతో వసంత పంచమి ఉత్సవాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అంకురార్పణ చేశారు.
30వ తేదీన అమ్మవారి జన్మ దినం వసంత పంచమి కావడంతో తమ చిన్నారులకు ఇక్కడ అందరూ అక్షరాభ్యాసం చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అక్షరాభ్యాసం నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
30వ తేదీన అమ్మవారి జన్మదినం (వసంత పంచమి) రోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి ఇతర ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.