వనపర్తి జిల్లా విద్యా శాఖలో అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ సెక్రెటరి భరత్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షడు సంతోష్ రాథోడ్, బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు దోమ వెంకట్, పర్శ నాయక్ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. వనపర్తి జిల్లాలో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో విద్యాశాఖలో పలు అవినీతి, అక్రమాలు జరుగుతున్నా జిల్లా ఇంచార్జీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్ గా పేరొందిన వనపర్తి జిల్లాలో ప్రభుత్వ విద్య అస్తవ్యస్థంగా మారి పోయిందని, జిల్లాలో పర్యవేక్షణ చేయాల్సీన డీఈఓ, ఎంఈఓలు అక్రమాలకు పాల్పడుతున్నా, ఇలాంటి వారిపై విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో విద్యావ్యవస్థ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని చెప్పారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో జీటీ నారాయణ, ఎల్ జీ కాన్సెప్ట్ స్కూళ్ల పేరిట బోగస్ బోనఫైడ్ లు ఇస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండానే గురుకుల, నవోదయ, కోరుకొండ కోచింగ్ సెంటర్ ను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కోచింగ్ సెంటర్ పై విచారణ చేసిన అధికారులు సీజ్ చేసినా కొత్తకోట ఎంఈఓ కోచింగ్ సెంటర్ ను కొనసాగించేందుకు సహకారం అందిస్తున్నాడని,ఈ విషయం పై జిల్లా కలెక్టర్, డీఈఓ లకు విద్యార్థి సంఘాలు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీంతో కోచింగ్ సెంటర్ యజమాని ప్రముఖ దినపత్రికలలో పేపర్ యాడ్స్ ఇస్తూ స్టూడెంట్ల తల్లిదండ్రులను మోసం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని యూఆర్ఎస్ ( అర్భన్ రెసిడెన్షియల్ స్కూల్ ) స్కూల్ లో అకౌంటెంట్ ఉద్యోగాన్ని ఓ మహిళకు అమ్ముకున్నారని, ఈ విషయం పై పత్రికల్లో వార్తలు వచ్చినా , సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఇవ్వకుండా డీఈఓ ఆఫీస్ అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. సరైన విద్యార్హతలు లేని ఓ మహిళకు అకౌంటెంట్ ఉద్యోగాన్ని అమ్ముకున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు తదితర మండల కేంద్రాలలో ఎలాంటి అనుమతులు లేకున్నా గురుకుల, నవోదయ, కోరుకొండ సైనిక్ స్కూల్ కోచింగ్ అంటూ గల్లీకో కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటున్నా ఆయా మండలాల ఎంఈఓ లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాముళ్లు తీసుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పైగా ఈ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న స్టూడెంట్లకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలలో చదువుతున్నట్లు బోగస్ బోనఫైడ్ లు ఇప్పిస్తూ తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
వనపర్తి డీఈఓ ఆఫీస్ లో వివిధ పనుల పేరుతో ఏళ్లుగా డిప్యూటేషన్ పేరుతో పాతుకుపోయి ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ తమ స్వంత పనులను చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ఆఫీస్ లో రెగ్యులర్ డీఈఓ లేకపోవడం, ఇంచార్జీ డీఈఓ వారంలో రెండు రోజులు మాత్రమే వస్తుండడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కొందరు సిబ్బంది డీఈఓ ఆఫీస్ లో పైరవీలు, కమీషన్లు వసూలు చేస్తూ తమ ప్రైవేట్ వ్యాపారాలు చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శించారు.
కొత్తకోట మండల కేంద్రంలో నివేదిత కాన్సెప్ట్ ప్రైవేట్ స్కూల్ ను ప్రభుత్వ టీచర్లు వాళ్ళ భార్యల పేరు మీద నడుపుతున్నారని వనపర్తి జిల్లా ట్రస్మా సభ్యులు డీఈఓ కు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేయాలని కొత్తకోట ఎంఈఓ కు ఆదేశాలు జారీ చేసినా కాని ఎంఈఓ ఇప్పటి వరకు ఎంక్వరీ చెయ్యడం లేదన్నారు. వనపర్తిలోని శ్రీచైతన్య స్కూల్ లో కనీసం సౌకర్యాలు లేదు వర్షం వస్తే తరగతి గదులు చెరువును తలపిస్తున్నాయని తెలిపారు. వాష్ రూమ్స్ దురవాసన , సబ్జెక్టు టీచర్స్ కూడా లేరని,ఆ స్కూల్ గుర్తింపు రద్దు చెయ్యాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్