వినుకొండ కొండపై వేంచేసిన రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 10వ తేదీన నిర్వహించే తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లతోటి శివశంకర్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు వివిధ శాఖల అధికారులతో కలిసి తొలి ఏకాదశి తిరునాళ్ళకు సంబంధించి కొండపై జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను,కొండపై ఉన్న గుడి మరియు అఖండ జ్యోతి ఉన్న పరిసరాలలో రక్షణ వలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళకు, అమరావతి అమరలింగేశ్వర స్వామి తిరునాళ్ళకు, మాచర్లలోని చెన్నకేశవస్వామీ తిరునాళ్ళకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామో అదే విధంగా ఈ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ళకు కూడా పటిష్ట బందోబస్తు కల్పిస్తామని తెలిపారు.
రెండు సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్న ఈ వేడులకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, మరి ముఖ్యంగా కొండపై జరిగే ఈ వేడుకలలో ఎక్కడ ఎటువంటి అనర్ధాలు సంభవించకుండా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఈ ఏడాది అఖండ జ్యోతి ప్రతిష్ట ఉంటుంది కావున భక్తులు అఖండ జ్యోతిని దర్శించుకునేటప్పుడు తొక్కిసలాటల జరిగి, వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో బారికేడ్లు,క్యూలైన్లు ఏర్పాటు చేయిస్తామని ఆయన అన్నారు. రెవెన్యూ, పోలీస్ మరియు ఇతర శాఖల వారు సమిష్టిగా పనిచేసి ఈ తొలి ఏకాదశి తిరునాళ్ళ విజయవంతానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.